ఆరోగ్యశ్రీకి కరోనా వర్తిస్తుందా? లేదా?
హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా వైరస్ నివారణ వైద్యం అందజేసే అవకాశం ఉందో లేదో తెలియ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ పరీక్షలు, వైరస్ నిర్ధారణ అయిన వాళ్ళుకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందజేస్తున్నదీ లేనిదీ వివరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ పి. అమర్ నాథ్ గౌడ్ లతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. కరోనా వైద్య పరీక్షలకు 4500 రూపాయలు వసూలు చేసేందుకు ప్రైవేటు లేబరేటరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, తిరుమలరావు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించి మరోసారి విచారించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ కింద కరోనా చికిత్స కోసం కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందని, వీటిని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా వైద్య పరీక్షలు, వైద్యం అందజేస్తున్నారో లేదో తెలియ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ 22కి వాయిదా వేసింది.