విరుచుకుపడుతున్న కరోనా
మీడియాఫైల్స్/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో ఏభైకి తక్కువకాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారంనాడు ఒకేరోజు ఏకంగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 87 కేసులు స్థానికంగా నమోదైనవే. వలసకార్మికులు, ప్రవాసులకు సంబంధించి 12 కేసులు నమో దు అయ్యాయి. జిహెచ్ఎంసితోపాటు వివిధ జిల్లాల్లో కొవిడ్ 19 లక్షణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా న మోదైన 99కరోనా కేసుల్లో 7౦ కేసులు గ్రే టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోనివే. మిగిలిన కేసుల్లో మేడ్చల్లో 3, మెదక్, నల్లగొండలో 2, రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబ్నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒకొక్క కేసు చొప్పున నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపింది. 24 గంటల వ్యవధిలో మరో నలుగురు కరోనా రోగులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 92కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2891కు చేరుకోగా, ప్రస్తుతం 1526 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 1273 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వ్యాప్తి పట్ల మరింత అప్రమత్తంగా వుండాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పదేళ్లలోపు పిల్లలను, 60 ఏళ్లు పైబడిన వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరింది.