అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకోండి
అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకోండి
ఇంటర్ బోర్డును ఆదేశించిన హైకోర్టు
తెలంగాణలో గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలల బ్రాంచిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా… ఇవాళ ఇంటర్ బోర్డు నివేదిక సమర్పించింది. ‘‘అగ్నిమాపక శాఖ ఎన్వోసీ లేని కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. మార్చి 4 నుంచి పరీక్షలు ఉన్నందున కళాశాలలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం ఉంటుంది. ఇప్పటికిప్పుడు కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. గుర్తింపు లేని కళాశాలల్లో 29,808 మంది విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపకశాఖ ఎన్వోసీ లేని కళాశాలల్లోనూ పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. పరీక్షలు ముగిసిన తర్వాత కళాశాలలు మూసివేసేందుకు అనుమతివ్వాలి’’ అని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.